– గణేశ్ పాడు గ్రామంలో ఘనంగా నిర్వహణ
ఇందూరు వార్త ఖమ్మం భద్రాద్రి జిల్లా బ్యూరో
వ్యవసాయ కళాశాల, అశ్వరావుపేట వారి ఆధ్వర్యంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం గణేశ్పాడు గ్రామంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రైతులకు ఆయిల్ పామ్ సాగు, సాగుపద్ధతులు, ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం వంటి కీలక అంశాలపై శాస్త్రీయ అవగాహన కల్పించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డా. ఐ.వి. శ్రీనివాస్ రెడ్డి, ప్రొఫెసర్ మరియు హెడ్, ఉద్యానవన విభాగం, అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల వారు మాట్లాడుతూ, “ఆయిల్ పామ్ సాగులో సాంకేతిక పద్ధతులు పాటిస్తే రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చు. దేశవ్యాప్తంగా వంటనూనెలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని, రైతులు విస్తృతంగా ఆయిల్ పామ్ సాగు చేపట్టాలి” అని పేర్కొన్నారు. ఆయిల్ పామ్ సాగులో నీటి నిర్వహణ, అంతర పంటల సాగు, సేంద్రియ ఎరువుల తయారీ, కలుపు నివారణ అంశాలను వివరించారు.అశ్వరావుపేట వ్యవసాయ విభాగం ఏ.డి.ఏ. శ్రీ కె. రవికుమార్ మాట్లాడుతూ, “జీవన ఎరువులు భూమిలో సేంద్రియ కార్బన్ శాతాన్ని పెంచుతాయి. భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వాడకాన్ని నిర్దేశించుకోవాలి” అని తెలిపారు. విత్తనాల కొనుగోలులో లైసెన్స్ కలిగిన డీలర్లను ఎంచుకోవడం, కొనుగోలు రశీదులు భద్రపరచుకోవడం ఎంతముఖ్యమో వివరించారు.పశుసంవర్ధక శాఖ నుండి డా. శ్యామ్ మాట్లాడుతూ, వేసవికాలం,వానాకాలంలో పశువులకు అవసరమైన టీకాలు, రోగాల నివారణ మరియు ఇతర సేవల గురించి వివరించారు. ఉద్యాన శాఖ అధికారి సంపత్ ఆయిల్ పామ్ సాగులో రైతులకు అందిస్తున్న రాయితీలు, సబ్సిడీ పథకాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ, గ్రామస్థాయిలో శాస్త్రవేత్తల నుంచి విద్యను తీసుకుని రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అమలు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు. యువజన నాయకుడు రాంబాబు మాట్లాడుతూ,గ్రామంలో రైతులే ఎక్కువగా ఉన్నందున ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన సాంకేతిక విజ్ఞానం అమలు చేయాలన్నారు.అంతేకాక, పురోగమించిన రైతు పూర్ణచంద్రరావు ఆయిల్ పామ్ తోటను శాస్త్రవేత్తలు మరియు రైతులు కలిసి సందర్శించారు. సాగు నిర్వహణ, పురుగుమందుల వినియోగం, మల్చింగ్, పంట మార్పిడి, చెట్లు నాటే ప్రాధాన్యం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.రైతులు ఈ శాస్త్రీయ సూచనలను పాటించి ఆధునిక వ్యవసాయ విధానాలతో ముందుకు సాగాలనే సంకల్పం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి వినోద్, గ్రామ పంచాయతీ కార్యదర్శి విజయ, కళాశాల శాస్త్రవేత్తలు డా. జంబమ్మ, డా. కే. శిరీష మరియు స్థానిక అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి దాదాపు 100 మంది రైతులు, రైతు కూలీలు, మహిళా రైతులు, ఆశా వర్కర్లు, విద్యార్థులు హాజరయ్యారు.