న్యాయం చేయండి…..
ఇంటి సరిహద్దులు తేల్చడంటూ ఎమ్మార్వో,ఎంపీడీఓ కి వినతిపత్రం.
ఇందూర్ వార్త కల్లూరు ప్రతినిధి గౌతమ్
నివాసముంటున్న ఇంటి స్థలం వివాదాస్పదంగా మారిన ఘటన మండల పరిధిలోని తూర్పు లోకారంలోని చోటుచేసుకుంది. బాధితులు చెప్పిన వివరాల ప్రకారం ఇంటి నెంబర్ 1-82/1 గల రేకుల షెడ్డులో ఇలారపు మధు, తండ్రి నగేష్ తన భార్య ముగ్గురు పిల్లలు నివాసం ఉంటున్నారు. ఆ ఇంటిని తన బాబాయి కుమారుడైన ఇలారపు శివ వద్ద కొనుగోలు చేశాడని తెలిపారు. ఏప్రిల్ 25 వ తారీఖున అదే గ్రామానికి చెందిన తడికమళ్ల కృష్ణ మరియు మరో వ్యక్తులు కలిసి మా రేకుల షెడ్డు ను ధ్వంసం చేసి మాపై దాడి చేసి మమ్మల్ని బయటకు వెళ్ళగొట్టారని తెలిపారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఆ తర్వాత మే రెండవ తేదీన పుల్లయ్య బంజర గ్రామానికి చెందిన జాబిశెట్టి చిన్న శ్రీను, పెద్ద శ్రీను, మాడిశెట్టి చిన్న శ్రీను వచ్చి డోజర్ తో పడి ఉన్న రేకుల షెడ్డు ను పక్కకు నెట్టడం జరిగిందని తెలిపారు. గ్రామానికి చెందిన తడికమళ్ల కృష్ణ, లలిత దంపతులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో ఆ ఇంటిని నా స్థలంలో కట్టేందుకు కుట్రపూరితంగా నాపై దౌర్జన్యానికి దిగుతూ నన్ను, నా పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. నాకు ఆ స్థలం తప్ప మరే ఆధారం లేదని ఉన్న ఇల్లుని పడగొట్టడంతో పక్కనున్న ప్రభుత్వ పాఠశాలలో నా ముగ్గురు పిల్లలతో తలదాసుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ స్థలంలో తడికమళ్ల కృష్ణ దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లు నిర్మించకుండా నిలిపివేయాలని అధికారులను వేడుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా వివాదంగా మార్చిన నా స్థలాన్ని సర్వే చేయించి నా ఇంటి సరిహద్దులను గుర్తించి నాకు న్యాయం చేయాలని శనివారం స్థానిక ఎమ్మార్వో పులి సాంబశివుడికి, ఎంపీడీవో చంద్రశేఖర్ కి వినతి పత్రం అందించడం జరిగింది. వివాదాస్పదంగా మారిన భూ సమస్యను అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని మండల ప్రజలు కోరుకున్నారు.






