ఆ నలుగురికి మంత్రి పదవి ఫిక్స్..! ఆశావహులకు అధిష్టానం బిజిగింపులు..!!
తెలంగాణ అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 10 రోజుల్లో కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉన్నది. ప్రస్తుతం 4 స్థానాలను భర్తీ చేసి మిగతా రెండు పదవులను పెండింగ్లో పెట్టేందుకు అధిష్టానం మొగ్గుచూపినట్టు సమాచారం.
సామాజిక సమీకరణల నేపథ్యంలో మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాని పలువురు ఆశావహులకు పార్టీ పదవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు సదరు లీడర్లను పార్టీ పెద్దలు బుజ్జగిస్తున్నారు. ఒక వేళ ఆ లీడర్లు సంతృప్తి చెందక పేచీ పెడితే.. విస్తరణ వాయిదా వేసి స్థానిక ఎన్నికల తర్వాత చేపట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
ఒకేసారి రెండు జాబితాలు
ఏడాదిన్నర కాలంగా పలు కారణాల వల్ల కేబినెట్ విస్తరణ వాయిదా పడుతూ వస్తున్నది. రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్.. కేసీ వేణుగోపాల్తో అటు పార్టీ పదవులు, ఇటు కేబినెట్ విస్తరణపై చర్చలు జరిపారు. ఒకేసారి రెండు జాబితాలను ప్రకటించాలని భావిస్తున్నారు. మంత్రి పదవులు దక్కని వారికి పార్టీ పదవులు ఇచ్చి సంతృప్తి పరచాలని భావిస్తున్నట్టు తెలిసింది. అందుకు ఆశావహుల నుంచి వచ్చే అభిప్రాయాలను బట్టి విస్తరణ ఆధారపడి ఉంటుందని టాక్. అసంతృప్తి వ్యక్తమైతే స్థానిక ఎన్నికల తర్వాతే మంత్రి వర్గ విస్తరణ చేపట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. లేదంటే అలకలు, అసంతృప్త నేతలు ఎన్నికల్లో సహాయ నిరాకరణ చేపడితే పార్టీ విజయానికి ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంటుంది.
ఆ నలుగురు ఫైనల్
కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్తో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. సామాజిక వర్గాల వారీగా మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేల వివరాలను సేకరించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైంది. బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి, మైనార్టీ నుంచి ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్, ఎస్సీ నుంచి వివేక్ పేర్లను ఎంపిక చేశారని తెలుస్తున్నది. బీసీ సామాజిక వర్గం నుంచి మరొకరికి మంత్రి ఇవ్వాలని డిమాండ్ వస్తుండటంతో ఆ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యేల జాబితాను అధిష్టానం పరిశీలించినట్టు టాక్.
కేసీ వేణుగోపాల్ బుజ్జగింపులు
రెడ్డి సామాజిక వర్గం నుంచి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోసం పోటీ పడుతుండటంతో వీరిలో ఒకరికి డిప్యూటీ స్పీకర్, మరొకరికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. కానీ, తనకు డిప్యూటీ స్పీకర్ పోస్టు వద్దని మల్రెడ్డి రంగారెడ్డి ఇప్పటికే తన అభిప్రాయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి చెప్పినట్లు టాక్. కానీ, మరోసారి ఆయన్ను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. అలాగే రాజగోపాల్ రెడ్డికి కేసీ వేణుగోపాల్ స్వయంగా ఫోన్ చేసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఆఫర్ చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. వీలైతే రాహుల్తోనూ మాట్లాడించే అవకాశం ఉన్నట్టు టాక్. ఒకవేళ రాజగోపాల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తీసుకునేందుకు ఒప్పుకుంటే విస్తరణ త్వరగా పూర్తవుతుందని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.
ఎస్టీలకు చీఫ్ విప్ లేదా డిప్యూటీ స్పీకర్
మంత్రి వర్గంలో ఎస్టీ లంబాడాలకు ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ వర్గానికి మంత్రి పదవి దక్కడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న బాలు నాయక్కు కేబినెట్ హోదాతో సమానంగా ఉండే డిప్యూటీ స్పీకర్ లేదా చీఫ్ విప్ పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్లో జరిగే కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో లంబాడాలకు మాత్రం మంత్రి పదవి ఇస్తామనే హామీని ఏఐసీసీ ఇచ్చినట్టు తెలుస్తున్నది.